|

స్పీడ్ ఎంత పెరిగినా ఫర్లేదు. ట్రాక్ మాత్రం తప్పకూడదు. వేగంగా విజయాలను అందుకోవాలి. సూటిగా లక్ష్యాన్ని ఛేదించాలి. ప్రస్తుతం ఇదే ఫిలాసఫీని ఫాలో అవుతున్నారు రామ్చరణ్. అందులో భాగంగా సంపత్నందితో ‘రచ్చ’ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ వేగాన్ని ఇలాగే కొనసాగిస్తూ ఫిబ్రవరి 23 నుంచి ‘ఎవడు’ షూటింగ్లో బిజీ అయిపోనున్నారు చరణ్.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మించనున్న ఈ సినిమాలో సమంత, ‘1947 ఎ లవ్స్టోరీ’ ఫేం ఆమీ జాక్సన్ కథానాయికలు. ‘‘వినోదం, యాక్షన్, థ్రిల్స్ అన్నీ కలబోసిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. కథే ఈ చిత్రానికి ప్రధాన బలం. రామ్చరణ్ పాత్రలో ఎన్నో కోణాలుంటాయి. మెగా అభిమానులకు ఆనందాన్ని పంచే విధంగా ఆయన పాత్ర చిత్రణ ఉంటుంది.
దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మా సంస్థలో ఆయన సంగీతం అందించిన చిత్రాలన్నీ ఘన విజయాలే పొందాయి. ఆ వరుసలోనే ఈ సినిమా కూడా నిలుస్తుంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, సహనిర్మాతలు: శిరీష్-లక్ష్మణ్, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.
|